న్యూఢిల్లీ: ఈసారి ఎండాకాలం దేశ ప్రజలపై కాస్త కరుణ చూపింది. ఎండలు దంచికొట్టే మే నెలలో వర్షాలు రికార్డు స్థాయిలో కురిశాయి. 121 ఏళ్లలో మే నెలలో కురిసిన రెండో అత్యధిక వర్షపాతమని భారత వాతావరణ శాఖ తన నెలవారీ నివేదికలో వెల్లడించింది. వెంట వెంటనే వచ్చిన రెండు తుఫాన్లు వర్షపాతాన్ని అమాంతం పెంచేశాయి. ఇక ఇండియాలో మే నెలలో నమోదైన సగటు అత్యధిక ఉష్ణోగ్రత 34.18 డిగ్రీల సెల్సియస్. 1901 తర్వాత మే నెలలో నమోదైన నాలుగో అత్యల్ప ఉష్ణోగ్రత కావడం విశేషం.
మే నెలలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత 32.68 డిగ్రీలు. 1917లో ఇది నమోదైంది. 1977 తర్వాత ఈసారి నమోదైన ఉష్ణోగ్రతే అత్యల్పమని వాతావరణ శాఖ తెలిపింది. ఇక మే నెలలో దేశంలో ఎక్కడా చెప్పుకోదగిన స్థాయిలో వడగాలులు కూడా లేవని చెప్పింది. మేలో దేశవ్యాప్తంగా నమోదైన వర్షపాతం 107.9 మిల్లీమీటర్లుగా ఉంది. ఇది సుదీర్ఘ కాల సగటు (ఎల్పీఏ) అయిన 62 మి.మీ. కంటే ఇది 74 శాతం అధికం కావడం విశేషం.
ఈ 121 ఏళ్లలో అత్యధికంగా 1990 మే నెలలో 110.7 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. ఈసారి మే నెలలో ఇటు బంగాళాఖాతంలో ఒకటి, అటు అరేబియా సముద్రంలో మరొకటి తుఫాన్లు ఏర్పడ్డాయి.