తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ కూడా ఒకడు. ఈయనతో పని చేయడానికి స్టార్ హీరోలు క్యూ కడతారు. మరోవైపు త్రివిక్రమ్ కేవలం సినిమాలు మాత్రమే కాకుండా కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తుంటాడు. ఇక్కడా అక్కడా చేసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు మాటల మాంత్రికుడు. ఈయన మాత్రమే కాదు తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు ఎండోర్స్ మెంట్ కూడా తెరకెక్కిస్తున్నారు. అందులో త్రివిక్రమ్ తో పాటు క్రిష్, సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకులు ఉన్నారు. అయితే మహేష్ బాబు లాంటి హీరోలు మాత్రం ఎక్కువగా తాము చేసే యాడ్స్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ ని దర్శకుడిగా ఎంచుకుంటారు.
ఎందుకంటే బ్రాండింగ్ ఎవరు చేయాలో కార్పొరేట్ కంపెనీ నిర్ణయిస్తుంది. కానీ ఆ బ్రాండింగ్ చేసే యాడ్ ఎవరు తెరకెక్కించాలనేది మాత్రం పూర్తిగా హీరో నిర్ణయం. వాళ్లు ఎవరు కోరుకుంటే వాళ్ల దగ్గరికి కంపెనీలు నడుచుకుంటూ వస్తాయి. మన తెలుగు ఇండస్ట్రీలో కమర్షియల్ యాడ్స్ తెరకెక్కించాలంటే త్రివిక్రమ్ తర్వాతే ఎవరైనా. ఈ యాడ్ తియ్యాలంటే దర్శకులకు మహా అయితే ఒక రోజు పడుతుంది. పైగా యాడ్ కు సంబంధించిన స్క్రిప్ట్, ఐడియా రెండు కంపెనీ ఇస్తుంది. కేవలం గ్రాండ్గా తమ బ్రాండ్ ప్రమోట్ చేయడమే వాళ్లకు కావాలి.
అయితే ఈ మధ్య త్రివిక్రమ్ శ్రీనివాస్ ను కాదని సందీప్ రెడ్డి వంగాతో ఒక ఏసీ యాడ్ చేశాడు మహేష్ బాబు. ఇందులో తమన్నా నటించింది. ఈ యాడ్ చేసినందుకు ఈయనకు అటు విడిగా కేవలం 5 లక్షలు మాత్రమే పారితోషికంగా అందిందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు త్రివిక్రమ్ మాత్రం ఒక్కో యాడ్ కోసం 30 లక్షల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక్క రోజు పని చేస్తే అన్ని లక్షలు రావడం చిన్న విషయం కాదు. ఈ విషయంలో మాటల మాంత్రికుడు అందరికంటే ముందున్నాడు. ఈయన చేసే యాడ్స్ కూడా అంతే సరదాగా ఉంటాయి. అందుకే కార్పొరేట్ కంపెనీలకు కూడా త్రివిక్రమ్ అంటే అంత మోజు.