ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. చైనా ఇంజినీర్లు ప్రయాణిస్తున్న బస్సును లక్ష్యంగా చేసుకుని పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటన అప్పర్ కోహిస్తాన్లో చోటు చేసుకుంది. దాసు డ్యామ్ నిర్మాణ పనులకు ఓ బస్సులో 30 మంది చైనా ఇంజినీర్లు, వర్కర్లు వెళ్తుండగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 9 మంది చైనా ఇంజినీర్లు, ఇద్దరు పారామిలటరీ సిబ్బంది, మరో ఇద్దరు వర్కర్లు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 13 మంది చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే ఇంజినీర్లు ప్రయాణిస్తున్న బస్సులో బాంబులు అమర్చారా? లేక రోడ్డు పక్కన అమర్చి పేలుళ్లకు పాల్పడ్డారా? అన్న విషయం తేలాల్సి ఉంది. పేలుళ్ల ధాటికి బస్సు లోయలోకి పడిపోయింది. ఒక చైనా ఇంజినీర్, మరో సైనికుడు తప్పిపోయారు. వీరి ఆచూకీ కోసం బలగాలు సహాయక చర్యలు ప్రారంభించాయి.
చైనా ఇంజినీర్లను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని చైనా ప్రభుత్వం డిమాండ్ చేసింది. చైనా ఇంజినీర్ల మృతుల పట్ల చైనా ప్రభుత్వం తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది.