ఆంక్షల నేపథ్యంలో విమానంలోనే పెండ్లి
విమాన సిబ్బందిని సస్పెండ్ చేసిన డీజీసీఏ
న్యూఢిల్లీ, మే 24: పెండ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మధుర జ్ఞాపకం. అయితే కరోనా కారణంగా వివాహ వేడుకలు కళ తప్పాయి. లాక్డౌన్ ఆంక్షలతో పెండ్లిళ్లు తూతూమంత్రంగా జరిపించడమో లేదా వాయిదా వేయడమో జరిగింది. అయితే ఈ ఆంక్షల నడుమే తమిళనాడుకు చెందిన ఓ జంట వినూత్నంగా వివాహం చేసుకుని వార్తల్లో నిలిచింది. మధురైకి చెందిన దక్షిణ, రాకేశ్ తమ పెండ్లికోసం మధురై నుంచి బెంగళూరుకు ఏకంగా ఒక స్పైస్జెట్ విమానాన్నే బుక్ చేసుకున్నారు. 161 మంది బంధుమిత్రుల సమక్షంలో సరిగ్గా విమానం మదురై మీనాక్షి అమ్మవారి ఆలయం మీదుగా వెళ్లగానే వరుడు వధువు మెడలో తాళికట్టాడు. ఈ వీడియో వైరల్గా మారింది. విమానంలోని వారు కొవిడ్ నిబంధనలు పాటించకపోవడం విమర్శలకు దారితీసింది. ఫ్లైట్ సిబ్బందిని డీజీసీఏ సస్పెండ్ చేసింది. కొవిడ్ నిబంధనలు పాటించనివారిపై కేసు నమోదు చేయాలని స్పైస్జెట్కు ఆదేశించింది.