కష్టాల కడలి దాటి..అభివృద్ధి వైపు పయనం
అభివృద్ధిలో దూసుకెళ్తున్న లక్ష్మీదేవిపల్లి మండలం
పూర్తయిన ప్రకృతి వనాలు, డంపింగ్యార్డులు,వైకుంఠధామాల నిర్మాణాలు
ఇక్కడి ప్రగతి అన్ని మండలాలకు ఆదర్శం
లక్ష్మీదేవిపల్లి, జూలై 12:లక్ష్మీదేవిపల్లి మండలంలోని ప్రజాప్రతినిధులది ఒకే మాట.. ఒకే బాట.. అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారంటే అదే అన్ని పంచాయతీల్లో అమలవుతుంది.. ఇదే స్ఫూర్తితో పల్లె ప్రగతి పనులనూ పూర్తి చేసి ఆదర్శంగా మండలంగా తీర్చిదిద్దారు.. మట్టి రోడ్లు సీసీ రోడ్లయ్యాయి.. సైడు కాలువలు, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డుల ఏర్పాటుతో గ్రామస్తుల కష్టాలు తీరాయి.. అవెన్యూ ప్లాంటేషన్, నర్సరీ, ప్రకృతి వనాలతో గ్రామాలు కొత్త కళను సంతరించుకున్నాయి.. ఈ నేపథ్యంలో మండలాభివృద్ధిపై ప్రత్యేక కథనం.
లక్ష్మీదేవిపల్లి మండలంగా ఏర్పడిన తర్వాత ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో అభివృద్ధి కార్యక్రమాలు చకాచకా జరిగాయి. రోడ్లు, సైడ్ డ్రైనేజీల నిర్మాణాలు, విద్యుత్ సౌకర్యాలు కల్పించారు. గ్రామాల్లో వీధిదీపాలు, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ కల్పించారు. అలాగే మండలాల్లోని అన్ని గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా చెత్తను తరలించడంతోపాటు అవసరమైన పనులు నిర్వహించుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. అలాగే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణాభివృద్ధి పథకం ద్వారా పనులు కూడా మండలంలో జోరుగా సాగుతున్నాయి. అవసరమైన ప్రతి ఒక్కరికీ కూలీ పనులు కల్పిస్తున్నారు. ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలవుతున్నాయి.
పల్లెప్రగతిలో మారిన రూపురేఖలు
ప్రభుత్వం ప్రవేశపెట్టి పల్లె ప్రగతి కార్యక్రమంతో మండల స్వరూపం పూర్తిగా మారింది. గ్రామాలన్నీ పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయి. మౌలిక వసతులన్నీ సమకూరాయి. పల్లె ప్రగతిలో నిర్దేశించిన పనులన్నీ ఈ మండలంలో వందకు వందశాతం పూర్తయాయి. మండలానికి 30 వైకుంఠధామాలు మంజూరు కాగా.. ఇప్పటి వరకు 25 నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 5 వివిధ దశల్లో ఉన్నాయి. డంపింగ్యార్డులు 31 మంజూరు కాగా.. అన్నీ పూర్తయ్యాయి. మండలంలో సొంత నిధులతో 14, రుణ సుదపాయంతో 16 ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. సొంత నిధులతో 31 ట్యాంకర్లను ఏర్పాటు చేసుకున్నారు. రైతు కల్లాలు 75 మంజూరు కాగా.. అన్నింటినీ కట్టేశారు. రైతువేదికలను మూడు నిర్మించారు. మిషన్ భగీరథ కింద రూ.22.74కోట్ల అంచనా వ్యయంతో 11,293 నల్లా కనెక్షన్లు ఇచ్చారు. మండల వ్యాప్తంగా 31 నర్సరీల్లో 4.65లక్షలు మొక్కలు పెంచారు. వీటిలో అన్ని మొక్కలు బతకడం విశేషం. పల్లె ప్రకృతి వనాలను 57 ఏర్పాటు చేశారు. వీటిలో 62,491 మొక్కలను పెంచుతున్నారు. హరితహారంలో భాగంగా 2020-21 ఏడాదిలో పంచాయతీ రాజ్, అనుబంధ శాఖల ద్వారా 3,23,771 మొక్కలను నాటారు. వాటిలో 3.23లక్షల మొక్కలు బతికాయి.
సంక్షేమం సంపూర్ణంగా..
ఒకవైపు మండలంలో అభివృద్ధి పనులు జరుగుతుండగా.. మరోవైపు ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్నాయి. మండలంలో 3,294 మంది రైతుబంధు లబ్ధిదారులు ఉండగా..వారికి రూ.5,23,42,379 జమ అయ్యాయి. ఇక రైతుబంధు పథకంలో 8 మందికి రూ.40లక్షలు జమ చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 10,222 మందికి జాబ్కార్డులు ఉండగా.. 3,981 కుటుంబాలు పనులకు హాజరవుతున్నారు. వీరికి 1,90,243 పనిదినాలు కల్పించారు. 3,589 మంది పెన్షన్లు పొందుతున్నారు. ఇందుకోసం రూ.76,48,408 విడుదలయ్యాయి. మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు 11,293 ఉన్నాయి.
పల్లె ప్రగతితో మరింత అభివృద్ధి
పది రోజుల పాటు జరిగిన పల్లె ప్రగతి కార్యాచరణ పనులతో పంచాయతీ మరింత అభివృద్ధి చెందింది. ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలు కూడా పరిష్కరించబడ్డాయి. ముఖ్యంగా డ్రైనేజీ, విద్యుత్ లైన్ల మార్పు, పారిశుధ్యం, తాగునీరు, రహదారుల సమస్యలపై ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించి పరిష్కరించేలా చర్యలు తీసుకున్నాం. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తాం.
-భూక్యా పద్మ, సర్పంచ్, సంజయ్నగర్
ప్రభుత్వ సూచనలతో అభివృద్ధి
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు లోబడి మండలాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నది. పల్లెప్రగతిలో నిర్దేశించిన పనులను పూర్తి చేస్తున్నాం. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపడింది. రోడ్లు, సైడ్ డ్రైనేజీలు ఏర్పాటయ్యాయి. ప్రజలకు మానసిక ఉల్లాసం కలిగేందుకు పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశాం. అలాగే మండల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తున్నాం.