న్యూఢిల్లీ: అసోంలో శనివారం తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు తెలివితో ఓటు వేయాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పిలుపునిచ్చారు. అసోం నుంచి 28 ఏండ్ల పాటు రాజ్యసభకు ప్రతినిధిగా వ్యవహరించిన ఆయన ఈ మేరకు ఒక వీడియో సందేశాన్ని శుక్రవారం విడుదల చేశారు. అభివృద్ధిని తెచ్చే ప్రభుత్వానికి ఓటు వేయాలని సూచించారు. ‘ఐదేండ్లు ఆర్థిక మంత్రిగా, పదేండ్లు ప్రధాన మంత్రిగా దేశానికి సేవ చేయడానికి అసోం ప్రజలు నాకు అవకాశమిచ్చారు. మీరు మీ ఓటు హక్కును వినియోగించుకునే రోజు వచ్చింది. తెలివిగా ఓటు వేయమని అడుగుతున్నాను’ అని అన్నారు.
అసోంను తిరుగుబాటు నుండి బయటకు తీసుకువచ్చి అభివృద్ధి వైపు తీసుకువెళ్ళింది తరుణ్ గొగోయ్ అని మన్మోహన్ సింగ్ తెలిపారు. అయితే, ఇప్పుడు సమాజం మళ్లీ మత, సాంస్కృతిక, భాషాపరంగా విభజనకు గురవుతున్నదని, ప్రజల ప్రాథమిక హక్కులను హరిస్తున్నారంటూ బీజేపీపై మండిపట్టారు. దేశవ్యాప్తంగా భయం, ఆందోళకర వాతావరణం నెలకొన్నదని, పెట్రోల్, గ్యాస్ ధరల పెరుగుదల పేదల జీవితాన్ని నరకప్రాయం చేశాయని, పేదలు మరింతగా పేదలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో అసోం తిరిగి శాంతి, అభివృద్ధి బాటలోకి రావాలని మన్మోహన్ సింగ్ ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో వివక్ష లేకుండా ప్రజల కోసం పని చేసే, రాజ్యాంగాన్ని గౌరవించే ప్రభుత్వం కోసం ప్రజలు ఓటు వేయాలని కోరారు. అసోం ప్రజలను కాపాడటానికి, అన్ని వర్గాల శ్రేయస్సు కోసం అసోం కాంగ్రెస్ కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు. పార్టీ మేనిఫెస్టోలో నిజమైన వాగ్దానాలు ఉన్నాయని చెప్పారు. తమ పార్టీ ఇచ్చిన ఐదు వాగ్దానాలు అసోం అభివృద్ధికి దోహదపడతాయని తాను భావిస్తున్నట్లు తెలిపారు.