ఇంఫాల్: మణిపూర్లో డెల్టా వేరియంట్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి రాష్ట్రంలో పది రోజులపాటు పూర్తిస్థాయిలో కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కర్ఫ్యూ ఈ నెల 18 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఆదివారం నుంచి అత్యవసర సర్వీసులు మినహా అన్ని రకాల సంస్థలను మూసిఉంచాలని ఆదేశించినట్లు మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ చెప్పారు. కర్ఫ్యూ సమయంలో కేవలం వ్యాక్సినేషన్, కరోనా పరీక్షల కోసమే ప్రజలను బయట తిరిగేందుకు అనుమతిస్తామని తెలిపారు.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,104 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 17 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 80,521కి చేరింది. ఇందులో 8,210 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 70,985 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.