సిద్దిపేట టౌన్, మే 16 : కరోనా బారిన పడినవారికి సిద్దిపేటకు చెందిన నారీసేన ఆపన్నహస్తాన్ని అందిస్తున్నది. ఐదుగురు సభ్యులతో కూడిన నారీసేన బృందం 39వ వార్డు కౌన్సిలర్ దీప్తీనాగరాజు నేతృత్వంలో కొనసాగుతున్నది. కరోనా అంటేనే భయపడే రోజులుండగా, కొవిడ్ బాధితులకు బాసటగా నిలుస్తున్నది. ఆరు రోజులుగా సుమారు 190మంది కరోనా బాధితులకు ఉచితంగా పోషక విలువలతో కూడిన ఆహారాన్ని రెండు పూటలు అందజేస్తూ పెద్ద మనస్సు చాటుతున్నది. వాట్సాప్(9948788288) గ్రూపు క్రియేట్ చేసి, దాని ద్వారా బాధితుల వివరాలను సేకరిస్తున్నది. బాధితులకు కావాల్సిన ఆహారాన్ని స్వయంగా తయారు చేసి ద్విచక్ర వాహనాలపై వారి ఇంటికి వెళ్లి ఆహారప్యాకెట్లు అందజేస్తున్నది. సుమారు నెల రోజులపాటు ఆహార పదార్థాలను ఉచితంగా అందించేందుకు నారీసేన బృందం సిద్ధంగా ఉంది. ఆహారంతోపాటు మందులను పంపిణీ చేయడమే కాకుండా ఆరోగ్య సూచనలు వివరిస్తున్నారు బృందం సభ్యులు.
కరోనా బాధితులకు సామాజిక కార్యకర్త భరోసా
కరోనా బారిన పడినవారి దగ్గరకు వెళ్లాలంటేనే భయపడుతారు. అలాంటి సమయంలో పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త ఎండీ షాదుల్ ముందుకొచ్చారు. వారం రోజులుగా కరోనా బాధితులకు ఆహారం అంద జేస్తూ అండగా నిలుస్తున్నారు. సొంత డబ్బులతో స్వచ్ఛందంగా కేసీఆర్నగర్ డబుల్ బెడ్రూం ఇండ్లలో శానిటైజేషన్ చేస్తూ సామాజిక బాధ్యతను గొప్పగా నిర్వర్తిస్తున్నారు. కాలనీ వాసులకు విలువైన ఆరోగ్య సూచనలు ఇస్తూ ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. స్వచ్ఛందంగా సేవ చేస్తున్న షాదుల్ను పట్టణ ప్రముఖులు అభినందిస్తున్నారు.