ముంబై : మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీతో కూడిన మహావికాస్ అఘది సర్కార్లో విభేదాలపై ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై శివసేన విమర్శలు గుప్పించడం ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేవలం ట్విట్టర్లోనే క్రియాశీలకంగా ఉంటారని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో శివసేన ఎద్దేవా చేసింది. మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని కాంగ్రెస్ రాష్ట్ర శాఖ చీఫ్ నానా పటోలె వ్యాఖ్యలపై సేన ఎంపీ సంజయ్ రౌత్ దీటుగా స్పందించారు.
మహారాష్ట్రలో సొంతంగానే పోటీ చేస్తామని చెబుతున్న వారికి ముఖ్యమంత్రి, శివసేన పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే దీటుగా బదులిచ్చారని అన్నారు. కాంగ్రెస్ సొంతంగా పోటీ చేస్తే తాము ఏం చేయాలని..తాము చేతులు కట్టుకుంటామా అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. సొంతంగా బరిలోకి దిగాలనుకునేవారు అలా చేసుకోవచ్చని స్పష్టం చేశారు. సేన, కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం ముదరిన క్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై శివసేన వ్యూహాత్మకంగా విరుచుకుపడింది. మరోవైపు శివసేన, బీజేపీ తిరిగి దగ్గరవుతాయనే ప్రచారం ఊపందుకున్న క్రమంలో మహారాష్ట్రలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణమాలు ఆసక్తికరంగా మారాయి.