హైదరాబాద్ : కొవిడ్-19 మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలోనూ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్) ఏప్రిల్ 2021లో రికార్డుస్థాయి బొగ్గు ఉత్పత్తిని నమోదు చేసింది. ఇదే కాలానికి 2020తో పోల్చితే ఈ ఏడాది రికార్డుస్థాయి బొగ్గు రవాణా జరిగిందని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ తెలిపారు.
ఎస్సీసీఎల్ ఏప్రిల్ 2021లో 48.56 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినట్లు చెప్పారు. ఇది 2020 ఏప్రిల్లో 30 లక్షల టన్నులుగా ఉందన్నారు. మహమ్మారి సమయంలోనూ సింగరేని ఉద్యోగులు అధిక వృద్ధి రేటు సాధించడంపై శ్రీధర్ హర్షం వ్యక్తం చేస్తూ ఉద్యోగులకు, కార్మికులను ప్రశంసించారు.
గనుల్లో పనిచేసేప్పుడూ ఉద్యోగులు కొవిడ్ భద్రతా నిబంధనలను పాటించాలని సూచించారు. 2021 సంవత్సర లక్ష్యాన్ని సాధించడంలో ప్రతి ఉద్యోగి పాత్ర కీలకమన్నారు. సింగరేణి సౌర విద్యుత్ ప్లాంట్లు 46.95 మిలియన్ యూనిట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.