న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి జూహీ చావ్లా.. దేశంలో 5జీ నెట్వర్క్ ట్రయల్స్కు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లిన సంగతి తెలుసు కదా. దీనిపై బుధవారం ఢిల్లీ హైకోర్టు వర్చువల్ విచారణ ప్రారంభించింది. అయితే ఈ విచారణలోకి వచ్చిన ఓ వ్యక్తి.. జూహిని చూసి ఆమె సినిమాల్లోని పాటలను పాడటం ప్రారంభించాడు. మొదట 1993లో జూహి నటించిన మూవీ హమ్ హై రాహీ ప్యార్ కే మూవీలోని ఘూంగట్ కి ఆద్ సే పాట పాడాడు. ఆ తర్వాత మీటింగ్లో నుంచి వెళ్లిపోయి మళ్లీ వచ్చాడు. ఈసారి 1995లో జూహి నటించిన నాజయాజ్ మూవీలోని లాల్ లాల్ హోటోంపే పాట పాడాడు. తర్వాత మీటింగ్లో నుంచి వెళ్లిపోయి మళ్లీ వచ్చాడు. మేరీ బన్నో కీ ఆయేగీ బారాత్ అంటూ మరో పాట అందుకున్నాడు.
ఇది చూసి జడ్జికి చిర్రెత్తుకొచ్చింది. వెంటనే ఆ వ్యక్తిని మీటింగ్లో నుంచి తొలగించారు. అంతేకాదు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్న హైకోర్టు.. ఆ వ్యక్తిని పట్టుకోవాలని పోలీసులను ఆదేశించింది. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. 5జీ నెట్వర్క్ పర్యావరణం, మనుషులపై తీవ్రమైన దుష్ప్రభావాలను చూపిస్తుందంటూ.. ఆ నెట్వర్క్ ట్రయల్స్ను ఆపాలని జూహి కోర్టుకెక్కిన విషయం తెలిసిందే.