పట్నా: ఆ ఇంట్లో రోజూ గొడవలవుతున్నాయి. ప్రశాంతంగా ఉండాల్సిన ఇంట్లో లొల్లికి నానమ్మే కారణమని ఆమెపై మనవడు కోపం పెంచుకున్నాడు. పండుగకని ఇంటికొస్తే.. ఈ గొడవలేందని నానమ్మపైకి లారీ ఎక్కించి హతమార్చిన ఘటన బీహార్లోని ముజఫ్ఫర్పూర్లో జరిగింది.
ముజఫ్ఫర్పూర్లోని రాక్సా గ్రామానికి చెందిన దిలీప్ లారీ నడుపుతూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉన్నాడు. దసరా పండుగకని గ్రామానికి వచ్చాడు. అయితే వారింట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. పండుగపూట ప్రశాంతంగా ఉందామని ఇంటికి వస్తే.. కుటుంబ కలహాలతో అతనికి చిర్రొత్తికొచ్చింది. ఈ లొల్లికంతటికీ తన నానమ్మే కారణమని ఆమెతో గొడవకు దిగాడు. వారిని దిలీప్ తండ్రి రాజేశ్వర్ రాయ్ అడ్డుకుని.. అతడిని ఇంట్లో నుంచి బయటకు పంపించాడు.
అయితే నానమ్మపై ఆగ్రహంతో ఉన్న ఆ యువకుడు.. ఆదివారం ఉదయం ఇంటి ముందు ముగ్గు వేస్తున్న ఆ వృద్ధురాలిపైకి తన లారీని ఎక్కించాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. తల్లిని చంపిన తన కొడుపై రాజేశ్వర్ రాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతడిని అరెస్టు చేశారు. దిలీప్పై కేసు నమోదుచేశామని, దర్యాప్తు చేస్తున్నామని, కుటుంబ కలహాలతో ఈ హత్య జరిగిందని పోలీసులు తెలిపారు.