ఆగ్రా: ఉత్తరప్రదేశ్లో ఓ యువతి తన బాయ్ఫ్రెండ్పై యాసిడ్ దాడి చేసింది. ఈ ఘటనలో 28 ఏళ్ల దేవేంద్ర రాజ్పుత్ మరణించాడు. ఆగ్రాలోని హరిపర్వత్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకున్నది. మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసిన ఆ యువతి తన బాయ్ఫ్రెండ్పై యాసిడ్ దాడి చేసింది. తీవ్రంగా శరీరం కాలడంతో.. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రైవేలు ల్యాబ్లో పనిచేస్తున్న ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. గత కొన్నాళ్ల నుంచి ఓ కిరాయి ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. అయితే అబ్బాయి తల్లితండ్రులు మరో యువతితో పెళ్లి ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అతని ప్రేయసి ఆగ్రహనికి గురైంది. సీలింగ్ ఫ్యాన్ను రిపేర్ చేయాలంటూ బాయ్ఫ్రెండ్ను ఇంటికి రమ్మన్న ఆ యువతి బాయ్ఫ్రెండ్పై కోపంతో యాసిడ్ చల్లింది. దాడి చేసిన మహిళను సోనమ్గా గుర్తించారు. బాయ్ఫ్రెండ్పై యాసిడ్ చల్లిన ఆమె కూడా స్వల్పంగా గాయపడింది. హాస్పిటల్లో ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నది. సోనమే తన కుమారుడిపై యాసిడ్ దాడి చేసి చంపేసినట్లు అతని పేరెంట్స్ ఆగ్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.