న్యూఢిల్లీ: ఎండాకాలం కావడంతో తాగునీటి కోసం మూగ జీవాలు అల్లాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బాగా దాహంతో ఉన్న కోతికి ఒక వ్యక్తి దాహార్తి తీర్చాడు. తన వాటర్ బాటిల్లోని నీటిని స్వయంగా తాగించాడు. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్లో శనివారం పోస్ట్ చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఇందులో ఒక టూరిస్ట్ ఒక కోతికి తన వాటర్ బాటిల్లోని నీటిని తాగిస్తాడు. ఇంతలో మరో కోతి అక్కడకు వచ్చి ఆ బాటిల్ను లాక్కోబోతుంది. అయితే వారించిన అతడు దానికి కూడా నీటిని తాగిస్తాడు. మరోవైపు మంచినీటిని తాగించిన ఆ వ్యక్తి చెంతకు మొదటి కోతి చేరి ఆప్యాయత చూపుతుంది. మీరు ప్రపంచంలో ఎలా ఉన్నప్పటికీ.. దయ కలిగి ఉండండి.. అని సుశాంత నందా ఈ వీడియోకు శీర్షిక పెట్టారు.
మరోవైపు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. మండుటెండలో కోతి దాహం తీర్చిన ఆ వ్యక్తిని కొందరు కొనియాడారు. దయాగుణం శక్తికి ఇది నిదర్శనమని ఒకరు వ్యాఖ్యానించారు.