నాగ్పూర్: మహారాష్ట్రలోని నాగ్పూర్ సిటీలో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. తన ఇంట్లో భార్య, ఇద్దరు పిల్లలను, అత్తగారింట్లో అత్తను, మరదలును హత్యచేసి ఆ తర్వాత ఉరేసుకుని తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున నాగ్పూర్లోని పచ్పవోలీ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అలోక్ మతుకార్ అనే వ్యక్తి ఈ తెల్లవారుజామున తన భార్య విజయ (40) గొంతుకోసి చంపేశాడు. ఆ తర్వాత కుమార్తె పారి (14), కొడుకు సాహిల్ (12) లను కూడా గొంతు కోసి హతమార్చాడు. ఆ తర్వాత అత్తగారింటికి వెళ్లి అత్త లక్ష్మీ బోబ్డే (55), మరదలు అమీషా బోబ్డే (21) లను గొంతులు కోసి చంపేశాడు. ఆ తర్వాత తిరిగి తన ఇంటికి వెళ్లి ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ ఉదయం తొమ్మిది గంటలైనా ఇంట్లోంచి ఎవరూ బయటికి రాకపోవడంతో పొరుగింటి వారు అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా రక్తపు మడుగులో మృతదేహాలు పడివున్నాయి. బస్తీ వాసులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మతూకర్ ఇంటి తలుపులు పగులగొట్టి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు.
ఆ తర్వాత మతూకర్ ఇంటికి కేవలం 200 మీటర్ల దూరంలో ఉన్న అతని అత్తగారింట్లో అత్త లక్ష్మి, మరదలు అమీషా కూడా హత్యకు గురైనట్లు గుర్తించి వారి మృతదేహాలను కూడా పోస్టుమార్టానికి తరలించారు. మతూకర్ టైలరింగ్ బిజినెస్ చేస్తున్నాడని, కుటుంబ తగదాల కారణంగానే అతను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తున్నదని పోలీసులు తెలిపారు.