భోపాల్: తప్పిపోయిన బర్రెను వెతికేందుకు వెళ్లి ఓ వ్యక్తి ఎలుగుబంటి దాడిలో మృతిచెందాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా టైగర్ రిజర్వ్ ఏరియాలోగల బగోహా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బగోహా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఎప్పటిలాగే మంగళవారం ఉదయం కూడా మేత కోసం తన బర్రెను వదిలేశాడు. అయితే, ఎప్పుడైనా సాయంత్రం ఇల్లు చేరే బర్రె ఆరోజు తిరిగిరాలేదు. దాంతో బర్రెను వెతకడం కోసం సమీప అడవిలోకి వెళ్లాడు.
రాత్రయినా బర్రె కోసం వెళ్లిన వ్యక్తి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు స్థానిక ఫీల్డ్ డైరెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆయన తన సిబ్బందితో కలిసి అటవీ ప్రాంతంలో గాలించగా తప్పిపోయిన వ్యక్తి శవమై కనిపించాడు. అతని ఒంటిపై ఏదో జంతువు దాడి చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. దాంతో అతను పులిదాడిలో మరణించాడని స్థానికులు భావించారు. కానీ మృతుడి ఒంటిపై ఉన్న గాయాలను బట్టి అతను ఎలుగుబంటి దాడిలో మరణించినట్లు అధికారులు నిర్ధారించారు.