యాప్లో పెట్టుబడి పెడితే భారీ లాభాలంటూ నమ్మించి… యాప్ స్క్రీన్పై పెట్టిన పెట్టుబడికి భారీ రాబడి అంటూ అంకెల గారడీని చూపించి.. ఓ గృహిణికి సైబర్నేరగాళ్లు రూ.20 లక్షలు టోకరా వేశారు. రాచకొండ సైబర్ క్రైం పోలీసుల వివరాల ప్రకారం.. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నివాసం ఉంటున్న ఓ మహిళ వాట్సాప్కు ఓ మెసేజ్ వచ్చింది. అందులో ‘విన్బిజ్’ సంస్థలో పెట్టుబడి పెడితే భారీ లాభాలంటూ ఉంది. దీనికి ఆసక్తి కనబర్చిన ఆ మహిళ మెసేజ్లో చెప్పినట్టుగా విన్బిజ్ ట్రేడింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుంది. యాప్ నిబంధనల మేరకు రూ. 500తో రీచార్జి చేసుకుంది. ఆమెకు వెంటనే విదేశీ నంబర్లతో కూడిన స్ట్రాటజీ టీమ్ అంటూ గ్రూపు అడ్మిన్ లింక్ అందింది. అది క్లిక్ చేయగానే ఆమె ఆ గ్రూపులో సభ్యురాలిగా చేరింది. ఆ తర్వాత రూ.20 వేలను పెట్టుబడిగా పెట్టింది. దానికి రూ.30 వేలు లాభం వచ్చినట్లు యాప్లో ప్రత్యక్షమైంది.
ఇలా.. పెట్టుబడి పెట్టుకుంటూ పోతే భారీగా లాభాలు వస్తాయని గ్రూపు లో పదే పదే రెచ్చగొట్టారు. దీనికి పడిపోయిన ఆ గృహిణి రూ. 20 లక్షలను పెట్టుబడిగా పెట్టింది. ఈ నగదును ఫిబ్రవరి 24 నుంచి మార్చి 15 వరకు ఆన్లైన్లో వారు చెప్పిన ఖాతాలో జమచేసింది. ఆమె విన్బిజ్ యాప్ ఖాతాలో రూ. 54.39 లక్షలు ఉన్నట్లు చూపించింది. వాటిని విత్ డ్రా చేసుకునేందుకు యత్నించగా సాధ్యం కాలేదు. దీంతో వారిని సంప్రదించేందుకు యత్నించగా వారు స్పందించలేదు. దీనికి తోడు ఇంకా పెట్టుబడి పెడితే మరిన్ని లాభాలు వస్తాయని పదే పదే మెసేజ్లు, వాట్సాప్ కాల్స్ చేస్తుండటంతో అప్పుడు మోసపోయానని గ్రహించిన బాధితురాలు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.