జైపూర్: రాజస్థాన్లోని కోటా జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి భార్యను దారుణంగా నరికి చంపి ఆమె మృతదేహాన్ని నడివీధిలో ఈడ్చుకెళ్లాడు. కోటా జిల్లా రామ్పుర పరిధిలోని భాతాపుర ఏరియాలో మంగళవారం సాయంత్రం ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భాతాపురకు చెందిన సునీల్ వాల్మికి అలియాస్ పింటూ (40), సీమ (35) ఇద్దరూ భార్యభర్తలు. మంగళవారం మధ్యాహ్నం తన సోదరుడి ఇంట్లో ఉన్న భార్యను, 9 నెలల కొడుకు అవినాష్ను పింటూ ఇంటికి తీసుకొచ్చుకున్నాడు.
సాయంత్రానికి పూటుగా మద్యం సేవించి భార్యపై దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను గొడ్డలితో నరికిచంపాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని వీధిలోకి ఈడ్చుకొచ్చాడు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. కాగా, ఆ దారుణం చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పింటూ భార్యపై దాడికి పాల్పడిన సమయంలో పసివాడైన వారి కొడుకు అవినాష్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు.
కాగా, పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పింటూకు గతంలో కూడా నేర చరిత్ర ఉన్నదని తెలిపారు. భౌతిక దాడులు, అత్యాచారం తదితర నేరాల కింద అతడిపై ఇప్పటికే ఐదే కేసులు నమోదై ఉన్నాయని చెప్పారు.