లక్నో: సర్పంచ్ కావాలని ఒక అభ్యర్థి ఆకాంక్షించగా ఆ సీటు మహిళకు రిజర్వ్ కావడం అతడ్ని నిరాశ పరిచింది. దీంతో తన మద్దతుదారుల సలహాతో లేటు వయసులో పెండ్లి చేసుకున్నాడు. అనంతరం తన భార్యను ఎన్నికల బరిలోకి దించాడు. ఉత్తరప్రదేశ్ బల్లియా జిల్లాలోని కరణ్ చాప్రా గ్రామానికి చెందిన హతి సింగ్ 2015 సర్పంచ్ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచాడు. ఈసారి ఎలాగైనా పంచాయతీ ఎన్నికల్లో గెలిచి గ్రామ అధిపతి కావాలనుకున్నాడు. అయితే ఆ స్థానం ఈసారి మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో ఏమి చేయాలో అతడికి పాలుపోలేదు.
కాగా, 45 ఏండ్ల హతి సింగ్ మద్దతుదారులు ఆయనకు సలహా ఇచ్చారు. పెండ్లి చేసుకుంటే భార్యను పంచాయతీ ఎన్నికల్లో నిలుపవచ్చని చెప్పారు. దీంతో హతి సింగ్ లేటు వయసులో ఈ నెల 26న ఒక మహిళను గ్రామంలోని ఆలయంలో పెండ్లి చేసుకున్నాడు. అయితే హిందూ సంప్రదాయం ప్రకారం పెండ్లి సరైన ముహుర్తాలు లేకపోయినప్పటికీ ఆయన పట్టించుకోలేదు. నామినేషన్ దాఖలుకు ఏప్రిల్ 13 చివరి రోజని, అందుకే ముందుగా పెండ్లి చేసుకున్నట్లు తెలిపాడు.
గ్రామం కోసం తాను గత ఐదేండ్లుగా చాలా కష్టపడ్డానని హతి సింగ్ చెప్పాడు. అయితే సర్పంచ్ సీటు మహిళకు రిజర్వ్ చేశారని, తన తల్లికి 80 ఏండ్లని, ఆమె పోటీ చేయలేరని తెలిపాడు. ఈ నేపథ్యంలో పెండ్లి చేసుకోకూడదనుకున్న తన నిర్ణయాన్ని మద్దతుదారుల సలహాతో మార్చుకున్నట్లు హరి సింగ్ చెప్పాడు. మరోవైపు డిగ్రీ చదువుతున్న వధువు, పెండ్లి అనంతరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నది.