ముంబై: ఇటీవల 360 సీట్లున్న విమానంలో ఒకే ఒక్క వ్యక్తి ప్రయాణించిన అరుదైన ఘటన చోటుచేసుకున్నది. ఈ నెల 19న బోయింగ్ 777 ఎమిరేట్స్ విమానంలో ఒకే వ్యక్తి ముంబై నుంచి దుబాయ్కి వెళ్లాడు. అతడు అందుకోసం కేవలం రూ.18 వేలు మాత్రమే చెల్లించాడు. కేవలం రూ.18 వేల కోసం 360 సీట్లున్న విమానాన్ని ముంబై నుంచి దుబాయ్కి తీసుకెళ్లడం ఏమిటి అనుకుంటున్నారా..? వినడానికి వింతంగా అనిపించినా జరిగింది మాత్రం ఇదే.
దుబాయ్కి చెందిన వజ్రాల కంపెనీ స్టార్ జెమ్స్ సీఈవో భవేష్ జవేరీ (40)కి ఇలా భారీ విమానంలో ఒంటరిగా ప్రయాణం చేసే అవకాశం దక్కింది. కరోనా కారణంగా భారత ప్రయాణికులపై యూఏఈ విధించిన నూతన ఆంక్షలతో ఇది సాధ్యపడింది. నూతన నిబంధన ప్రకారం దౌత్యసిబ్బంది, యూఏఈ గోల్డెన్ వీసాదారులు, అరబ్ జాతీయులు మాత్రమే భారత్ నుంచి దుబాయ్కి వెళ్లేందుకు అనుమతి ఉంది. అయితే ఈ నెల 19న బోయింగ్ 777 ఎమిరేట్స్ విమానం ముంబై నుంచి దుబాయ్కి వెళ్లేందుకు సిద్ధమైంది.
అయితే, యూఏఈ నూతన నిబంధనల ప్రకారం.. ఆ రోజుకు గోల్డెన్ వీసాతోపాటుగా అన్ని అనుమతులు ఉన్న ఒకే ఒక వ్యక్తి భవేష్ జవేరి. దాంతో నిబంధనల ప్రకారం ఆయనకు టికెట్ ఇచ్చారు. ఆ విమానంలో తాను ఒక్కడే ప్రయాణించబోతున్నట్లు సిబ్బంది అతనికి తెలియజేశారు. దాంతో ఆయన ఆనందాన్ని పట్టలేక కాసేపు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. విమానం ఎక్కగానే సిబ్బంది ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఒక్కడే ప్రయాణికుడు కావడంతో భవేస్ విమానం అంతా కలియతిరుగుతూ సిబ్బందితో సరదా కబుర్తు చెప్పుకుంటూ దుబాయ్కి చేరుకున్నారు.