ముంబై : మిట్ట మధ్యాహ్నం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. ఓ వైపు ఎగిసిపడుతున్న అగ్నికీలలు.. మరో వైపు దట్టమైన పొగలు.. అగ్నికీలల నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి చేసిన సాహసం అతని ప్రాణాలకు ముప్పుగా మారింది.
ముంబై అవిఘ్న పార్కులోని 61 అంతస్తుల భవనంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. 19వ ఫ్లోర్లో మంటలు చెలరేగడంతో.. అక్కడున్న ఓ 30 ఏండ్ల యువకుడు అరుణ్ తివారీ తన ప్రాణాలను కాపాడుకునేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ఆ అంతస్తులోని బాల్కనీలోకి తివారీ వచ్చాడు. అక్కడ్నుంచి కింది అంతస్తులోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో పట్టు కోల్పోయి.. కింద జారిపడ్డాడు. దీంతో అతను చనిపోయాడని బీఎంసీ డిజాస్టర్ కంట్రోల్ అధికారులు వెల్లడించారు.
దక్షిణ ముంబైలోని అవిఘ్న పార్కులోని 61 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగినట్లు ఉదయం 11:55 గంటలకు తమకు సమాచారం అందిందని బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ చహల్ తెలిపారు. తక్షణమే అక్కడికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది.. 19వ ఫ్లోర్లో చెలరేగిన మంటలను అదుపు చేసే పనిలో నిమగ్నమైందని చెప్పారు. ఆ అంతస్తులో ఉన్న అందరూ ప్రాణాలతో ఉన్నారని తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని బీఎంసీ కమిషనర్ పేర్కొన్నారు. ముంబై మేయర్ కిషోరి పడ్నేకర్ ప్రమాద స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.