న్యూఢిల్లీ: ఊపిరి ఆడని కోవిడ్ రోగులకు.. ఆక్సిజన్ అందని వ్యాధిగ్రస్తులకు మాత్రమే రెమ్డిసివిర్ ఇంజెక్షన్ వాడాలని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న నేపథ్యంలో .. చాలా మంది రోగులకు ఊపిరాడని సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. దీంతో రెమ్డిసివిర్ ఇంజెక్షన్కు డిమాండ్ పెరిగింది. ఆ ఇంజెక్షన్లను మితంగా, అవసరాన్ని బట్టి వాడాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. రెమ్డిసివిర్ ఇంజెక్షన్లను కేవలం హాస్పిటళ్లకు మాత్రమే సరఫరా చేయాలని, కెమిస్టులు కానీ రోగులకు ఆ ఇంజెక్షన్లను నేరుగా సరఫరా చేయరాదంటూ ఆరోగ్యశాఖ హెచ్చరించింది. హాస్పిటల్లో చేరిన రోగుల్లో ఎవరికైతే తక్కువ స్థాయిలో ఆక్సిజన్ అందుతుందో వారికి మాత్రమే ఆ ఇంజెక్షన్ ఇవ్వాలని కేంద్రం సూచించింది. ఇంటి వాతావరణంలో రెమ్డిసివిర్ను వాడవద్దు అంటూ నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పౌల్ తెలిపారు.
దేశవ్యాప్తంగా రెమ్డిసివిర్ ఇంజెక్షన్కు డిమాండ్ ఉన్న నేపథ్యంలో కేంద్రం ఈ హెచ్చరికలు జారీ చేసింది. అనవసర ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొన్నది. మరో వైపు సుమారు 25వేల రెమ్డిసివిర్ ఇంజెక్షన్లు కావాలంటూ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ .. కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అత్యవసర రీతిలో గుజరాత్ నుంచి ఆ ఇంజెక్షన్లు పొందాలంటూ ఆయన తమ ఆరోగ్యశాఖను ఆదేశించారు.