కోల్కతా, మే 28: ‘మీరు నన్ను కలవాలనుకొన్నారు. అందుకే వచ్చాను. యాస్ తుఫాను వల్ల మా రాష్ర్టానికి కలిగిన నష్టంపై నివేదిక తీసుకోండి. మాకు వేరే మీటింగ్ ఉంది. మీరు అనుమతిస్తే వెళ్తాను..’ యాస్ తుఫాను కలిగించిన నష్టాన్ని పరిశీలించేందుకు పశ్చిమబెంగాల్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీతో కొన్ని నిమిషాలపాటు జరిగిన భేటీ సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం మమత అన్న మాటలివి. బెంగాల్ ఎన్నికల తర్వాత ఇద్దరి మధ్య జరిగిన ఈ తొలి భేటీ ఇది. తొలుత మోదీ ఒడిశాలో ఏరియల్ సర్వే అనంతరం బెంగాల్లోని కలైకుండ ఎయిర్ బేస్లో ల్యాండ్ అయ్యారు. అక్కడే ఇద్దరి మధ్య భేటీ జరుగాల్సి ఉండగా మోదీకి ఆహ్వానం పలకడానికి మమత సహా, బెంగాల్ ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా రాలేదు. ఆ సమయంలో మమత, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ చుట్టుపక్కలే ఉన్నారని, కానీ మోదీకి ఆహ్వానం పలుకలేదని కేంద్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మోదీ దాదాపు 15నిమిషాలు ఎదురు చూసిన తర్వాత మమత హడావుడిగా అక్కడికి వచ్చి నివేదిక ఇచ్చి వెళ్లిపోయారని పేర్కొన్నాయి. ‘రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ప్రధాని, గవర్నర్లతో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత దారుణంగా, అగౌరవంగా, అహంకారపూరితంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు’ అని పేర్కొన్నాయి.
యాస్ తుఫాను వల్ల బెంగాల్లో 20వేల కోట్ల నష్టం సంభవించిందని మమత తన నివేదికలో చెప్పారు. సుందర్బన్, దిఘాలను తిరిగి అభివృద్ధి చేయడం కోసం ఒక్కో ప్రాంతానికి రూ.10వేల కోట్ల చొప్పున సాయం చేయాలని కోరారు. ‘కేంద్రం నుంచి ఏం రాకపోయినా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం’ అని మోదీతో భేటీ అనంతరం జరిగిన అధికారుల సమావేశంలో అన్నారు. ఇదిలా ఉండగా, తుఫాను ప్రభావిత రాష్ర్టాలకు అత్యవసర సహాయం కింద కేంద్రం బెంగాల్కు రూ.500కోట్లు విడుదల చేసింది.
మమత బెంగాల్ ప్రజల సంక్షేమాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా అహంకారపూరితంగా వ్యవహరించారని కేంద్రవర్గాలు వ్యాఖ్యానించాయి. ‘ఆవేశపూరిత మనస్తత్వంలో సమాఖ్య స్ఫూర్తికి ఆమె తీవ్ర విఘాతం కలిగించారు’ అని పేర్కొన్నాయి. మమత రాజ్యాంగ విలువలను, సహకార సమాఖ్య స్ఫూర్తిని హత్య చేశారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. మోదీతో భేటీని మమత బాయ్కాట్ చేశారని గవర్నర్ జగదీప్ ధన్కర్ అన్నారు.
ప్రధాని మోదీని ఎదురు చూసేలా చేశారన్న ఆరోపణలను బెంగాల్ సీఎం కార్యాలయం ఖండించింది. వేరే సమావేశాలు ఉన్నాయని ముందుగానే సమాచారం ఇచ్చినా మోదీనే మమతను అరగంట పాటు ఎదురు చూసేలా చేశారని తెలిపింది. అదే ఆమె అసహనానికి కారణమని, నివేదిక సమర్పించి వెంటనే వచ్చారని వెల్లడించింది.