బెంగాల్ సీఎం మమత డిమాండ్
న్యూఢిల్లీ, జూలై 27: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మంగళవారం ప్రధాని నరేంద్రమోదీని ఆయన నివాసంలో కలిశారు. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై ఘన విజయం సాధించిన అనంతరం ఆమె ఢిల్లీ రావడం ఇదే తొలిసారి. ప్రధానితో భేటీ తర్వాత ఆమె మాట్లాడుతూ.. ‘పెగాసస్ గూఢచర్యం’ అంశాన్ని చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పెగాసస్పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయించడం అవసరమన్నారు. ప్రతిపక్షాల మధ్య ఐక్యత దానతంటదే వస్తుందని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. మోదీతో భేటీకి ముందు కాంగ్రెస్ సీనియర్ నేతలు కమల్నాథ్, ఆనంద్ శర్మను మమత కలిశారు. బుధవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో మమత భేటీ అవుతారని సమాచారం.
రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి: విపక్షాలు
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలు, పెగాసస్ ఫోన్ హ్యాకింగ్పై పార్లమెంటులో చర్చ జరిగేలా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ జోక్యం చేసుకోవాలని ఏడు విపక్షపార్టీలు కోరాయి. ఈ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని మంగళవారం సమిష్టిగా రాష్ట్రపతికి లేఖను రాశాయి. లేఖపై బీఎస్పీ, ఆర్ఎల్పీ, అకాలీదళ్, నేషనల్ కాన్ఫరెన్స్, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ పార్టీల నేతలు సంతకాలు చేశారు. ఎన్సీపీ నేత సుప్రియా సూలే మీడియాకు ఈ సంగతి వెల్లడించారు.
పెగాసస్పై అధికారులను ప్రశ్నించనున్న పార్లమెంటరీ ప్యానెల్‘పెగాసస్’పై అధికారులను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చెందిన పార్లమెంటరీ ప్యానెల్ ప్రశ్నించనుంది. ఇప్పటికే కేంద్ర ఐటీ, హోంశాఖకు చెందిన పలువురు అధికారులను తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.