కోల్కతా : పెగాసస్ రగడపై విచారణకు ఆదేశించిన తొలి రాష్ట్రం తమదేనని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం వెల్లడించారు. సీనియర్ న్యాయమూర్తి మదన్ భీంరావ్ లోకూర్, కలకత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జ్యోతిర్మయ్ భట్టాచార్యల నేతృత్వంలో అక్రమ హ్యాకింగ్, నిఘాలపై దర్యాప్తునకు ద్విసభ్య కమిషన్ను ఏర్పాటు చేశామని ఆమె పేర్కొన్నారు. వీరు అక్రమ హ్యాకింగ్, నిఘా, మొబైల్ ఫోన్ల రికార్డింగ్ ఆరోపణలపై విచారణ జరుపుతారని చెప్పారు.
పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ చేపడుతుందని ఆశించామని, అయితే కేంద్రం ఈ దిశగా చొరవ తీసుకోలేదని దీదీ వ్యాఖ్యానించారు. పెగాసస్ ఉదంతానికి సంబంధించి తృణమూల్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పెగాసస్ స్పైవేర్తో చివరికి భారత సైన్యాన్నీ పాలకులు విడిచిపెట్టలేదని ఆయన ఆరోపించారు. హ్యాకింగ్కు బాధ్యులు ఎవరో పార్లమెంట్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.