కోల్కతా: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రోద్బలంతోనే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీతో పాటు తమ కార్యకర్తలపై త్రిపురలో దాడి జరిగిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. త్రిపురలో అభిషేక్ బెనర్జీ సహా తృణమూల్ కార్యకర్తలపై కాషాయ పార్టీ శ్రేణులు ఇటీవల దాడికి తెగబడిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. త్రిపుర, అసోం, యూపీ సహా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అరాచక పాలన సాగిస్తోందని దీదీ దుయ్యబట్టారు.
త్రిపురలో అభిషేక్ బెనర్జీతో పాటు తృణమూల్ కార్యకర్తలపై దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి మద్దతు లేకుండా ఇలాంటి దాడులు జరిగే అవకాశం లేదని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. మరోవైపు త్రిపురలో బీజేపీ గూండాల నిజస్వరూపం ఈ దాడులతో బయటపడిందని ఎంపీ అభిషేక్ బెనర్జీ అన్నారు. త్రిపురలో గూండా సర్కార్కు ఇది నిదర్శనమని ఎద్దేవా చేశారు. కాషాయ పార్టీ కుట్రలు, కుతంత్రాలకు తృణమూల్ కాంగ్రెస్ బెదిరిపోదని స్పష్టం చేశారు.