కోల్కతా : పెగాసస్ ద్వారా తమ ఫోన్లను హ్యాక్ చేస్తున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీజేపీ పాలనలో చట్ట నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. భవానీపూర్లో శుక్రవారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి దీదీ మాట్లాడారు.
బెంగాల్కు సీపీఎం తీవ్ర అన్యాయం చేసినా వారిపై ఎలాంటి విచారణలు, ఈడీ కేసులు లేవని గుర్తుచేశారు. బీజేపీ గూండాగిరీ చేస్తూ దౌర్జన్యాలు సాగిస్తోందని కాషాయపార్టీ నిత్యం అరాచకాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. బీజేపీ శ్రేణులు వారి ఇండ్లపై వారే బాంబులు వేసుకుంటూ తమపై దాడి జరుగుతోందని గగ్గోలు పెడుతున్నారని ఆరోపించారు. తమ పార్టీ గూండాల పార్టీ కాదని దీదీ స్పష్టం చేశారు.