న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్కు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. తనను గాయపడేలా చేసిన అమిత్ షా తన చావును కోరుకుంటున్నారని అన్నారు. పుర్బ వర్ధమాన్లో శుక్రవారం జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
పోలింగ్ తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్లో ప్రచారం చేపట్టినా ఆయన ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఈసీ ఇంతవరకూ వెల్లడించలేదని దీదీ ఎన్నికల కమిషన్ తీరును దుయ్యబట్టారు. కాగా నందిగ్రామ్లో నామినేషన్ వేసిన తర్వాత కొందరు వ్యక్తులు తనపై దాడి చేయడంతో తన కుడి కాలుకు గాయమైందని మమతా బెనర్జీ మార్చి 10న ఆరోపించిన సంగతి తెలిసిందే. కాలికి గాయం అనంతరం దీదీ వీల్ ఛైర్లోనే ఎన్నికల ప్రచార ర్యాలీలకు హాజరవుతున్నారు.