హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): నూతన విద్యాసంవత్సరాన్ని జూన్ 15వ తేదీనుంచి ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు యోచిస్తున్నారు. కరోనా దృష్ట్యా ప్రత్యక్ష తరగతులు నిర్వహించే అవకాశం లేకపోవడంతో ఆన్లైన్ క్లాసులను మొదలుపెట్టాలని భావిస్తున్నా రు. ఇందుకు అనుమతి కోరుతూ త్వరలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నారు. నూతన విద్యాసంవత్సరం బ్రిడ్జికోర్సులతో ప్రారంభంకానున్నది. జూన్నుంచి ఆగస్టు వరకు విద్యార్థులకు బ్రిడ్జికోర్సుల్లోని పాఠ్యాంశాలనే బోధించనున్నారు. గత విద్యాసంవత్సరంలోని ముఖ్యమైన పాఠ్యాంశాలను తిరిగి నేర్పించడం, పునశ్చరణ చేయడంలో భాగంగా ఈ బ్రిడ్జికోర్సులను నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. అభ్యసన నష్టాన్ని నివారించడంలో భాగంగా ఈ ఏర్పాట్లుచేయాలని సూచించింది. ఈ కోర్సుల పాఠ్యాంశాల రూపకల్పన బాధ్యతను ఎస్సీఈఆర్టీకి అప్పగించారు. జూన్ మొదటివారంలోగా మెటీరియల్ ముద్రణను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆగస్టు 15 తర్వాతే తమ తరగతికి సంబంధించిన కొత్త పాఠ్యాంశాలను నేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆన్లైన్ క్లాసుల ప్రారంభానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. బ్రిడ్జికోర్సుల మెటీరియల్ను సిద్ధంచేసి, విద్యార్థులకు అందజేస్తామని తెలిపారు.
షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నుంచి ఇంటర్ ఆన్లై తరగతులు ప్రారంభంకావాల్సి ఉండగా.. లాక్డౌ న్, కరోనా దృష్ట్యా క్లాసులను వాయిదావేయాలని బోర్డు అధికారులు భావిస్తున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ సాధారణ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి ఈ నెల 30న జరిగే రాత పరీక్షను వాయిదా వేసినట్టు గురుకుల సెట్ కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలిపారు.