కోల్కతా, మే 5: రాష్ట్రంలో హింసాత్మక వాతావరణాన్ని సృష్టిస్తున్న వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోనని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు. బెంగాల్ 21వ ముఖ్యమంత్రిగా మమత బుధవారం ప్రమాణం చేశారు. బెంగాల్కు దీదీ సీఎం కావడం వరుసగా ఇది మూడోసారి. రాజ్భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ జగ్దీప్ ధన్కర్ ఆమెతో ప్రమాణం చేయించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మదినమైన మే 9న మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రమాణం అనంతరం మమత మాట్లాడారు. తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం కరోనాను కట్టడి చేయడమేనన్నారు. బీజేపీ గెలుపొందిన ప్రాంతాల్లోనే హింస, ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వీడియోలు చాలావరకు ఫేక్ లేదా పాత వీడియోలు అని పేర్కొన్నారు. ఘర్షణలు జరిగినప్పుడు శాంతిభద్రతలు ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నాయని గుర్తుచేశారు. మమత ప్రమాణ కార్యక్రమంలో టీఎంసీ సీనియర్ నేతలతో పాటు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పాల్గొన్నారు. ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నేతలు హాజరుకాలేదు.
బెంగాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం చోటుచేసుకున్న హింసాకాండలో 14 మంది బీజేపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని, లక్ష మంది తమ ఇండ్లను వదిలి వెళ్లిపోయారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. తమ కార్యకర్తలను చంపుతున్నారని, మహిళలపై లైంగికదాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హింసా కాండలో సీఎం మమతా బెనర్జీ ప్రమేయమున్నదన్నారు. ప్రజలు గతేడాది ‘అంఫాన్’ తుఫాన్ను ఎదుర్కొన్నారని, ఇప్పుడు ‘మమతఫాన్’ను ఎదుర్కొంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందా అన్న ప్రశ్నపై.. ఇందుకు సంబంధించి గవర్నర్ నివేదిక రూపొందించారని, దీనిపై కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంటుందన్నారు.