కోల్ కతా : యాస్ తుఫాన్ పై ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన సమీక్షా సమావేశానికి తాను హాజరు కాకపోవడం పట్ల మోదీ సర్కార్, ప్రధాని కార్యాలయం ఏకపక్ష, బూటకపు వార్తలను మీడియాకు చేరవేస్తోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. తాను వేరే సమావేశాల్లో పాల్గొనాల్సి ఉందని, ప్రధాని అనుమతి తీసుకునే అక్కడి నుంచి వెనుదిరిగానని ఆమె స్పష్టం చేశారు.
బెంగాల్ భవిష్యత్ ప్రమాదంలో పడేలా తాను ఎన్నడూ వ్యవహరించనని, బెంగాల్ ప్రజల సంక్షేమం కోసం ప్రధాని కోరితే ఆయన పాదాలు తాకేందుకు సిద్ధమని..అయితే తనను అవమానించడం తగదని దీదీ వ్యాఖ్యానించారు. బెంగాల్ ప్రజల సంక్షేమానికి తాను సెక్యూరిటీ గార్డులా పనిచేస్తానని స్పష్టం చేశారు. యాస్ తుఫాన్ పై సమీక్షా సమావేశానికి అసలు గవర్నర్, బీజేపీ నేతలను ఎందుకు పిలిచారని ప్రశ్నించారు.
సీఎం, ప్రధాని హాజరు కావాల్సిన ఈ భేటీకి వారిని ఆహ్వానించడం తనను అవమానించడమేనని అన్నారు. వారు ఓ ప్రణాళిక ప్రకారమే కొన్ని ఖాళీ కుర్చీలు చూపారని, సమావేశానికి అవసరం లేని రాజకీయ నేతలను అక్కడ చూసినప్పుడు తాను ఎందుకు కూర్చోవాలని ఆమె ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ సమాఖ్య వ్యవస్థపై దాడికి పూనుకుందని దీదీ ఆరోపించారు. ప్రజల తీర్పును బీజేపీ అంగీకరించాలని హితవు పలికారు. బెంగాల్ లో అధికారం కోసం కాషాయ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ పార్టీ ఘన విజయం సాధించిందని అయినా కాషాయ నేతల్లో మార్పు లేదని మండిపడ్డారు.