న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీతో భేటీల్లో ముఖ్యమంత్రులను అన్నింటికీ తలలూపే తోలుబొమ్మల స్థాయికి దిగజార్చారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం ఆరోపించారు. కొవిడ్-19 పరిస్థితిపై చర్చించేందుకు పది రాష్ట్రాల అధికారులు, సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న అనంతరం దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానితో కొవిడ్-19పై జరిగే సమావేశాల్లో ముఖ్యమంత్రులను కనీసం మాట్లాడేందుకూ అనుమతించడం లేదని ఆరోపించారు.
సీఎంలను మాట్లాడేందుకు అనుమతించకపోతే ఇక వారిని ఎందుకు పిలిచారని ఆమె ప్రశ్నించారు. ప్రధానితో భేటీల్లో మాట్లాడేందుకు అనుమతించకపోవడంపై అన్ని రాష్ట్రాల సీఎంలు నిరసన తెలపాలని దీదీ పిలుపు ఇచ్చారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని ఈ సమావేశంలో ప్రధాని వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అలాగైతే దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో మహమ్మారి బారినపడి ప్రజలు ఎందుకు మరణిస్తున్నారని దీదీ నిలదీశారు. సీఎంలతో ప్రధాని సమావేశం దారుణంగా విఫలమైందని ఇది సీఎంలను అవమానించేలా ఉందని ఆమె పేర్కొన్నారు.