కోల్ కతా : తన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారందరి వివరాలను రాబడతానని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కూచ్ బెహర్ కాల్పుల ఘటనపై దీదీ మాట్లాడినట్టు చెబుతున్న ఆడియో క్లిప్ వైరల్ గా మారిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తామన్నారు. సితాల్ కుచ్చి టీఎంసీ అభ్యర్థి పార్థ ప్రతిం రాయ్, దీదీ మధ్య ఈ సంభాషణ సాగినట్టు చెబుతున్నారు.
కూచ్ బెహర్ కాల్పుల ఘటనలో మరణించిన వారి పార్థివ దేహాలతో నిరసన ర్యాలీ చేపట్టాలని ఈ సంభాషణలో దీదీ చెబుతున్నట్టు ఆడియో క్లిప్ లో రికార్డైంది. కాగా, ఆడియో క్లిప్ ద్వారా బెంగాల్ లో ఉద్రిక్తతలను పెంచేలా టీఎంసీ కుట్ర పన్నిందని ఆరోపిస్తూ బీజేపీ ప్రతినిధులు బెంగాల్ ఎన్నికల ప్రధానాధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. మరోవైపు కూచ్ బెహర్ కాల్పుల ఘటనను టీఎంసీ రాజకీయం చేస్తోందని అసన్సోల్ లో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు.