కోల్ కతా : కొవిడ్-19 సెకండ్ వేవ్ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ లో లాక్డౌన్ విధించబోమని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. మే 5 నుంచి బెంగాల్ లో 18 ఏండ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ డోసులు అందిస్తామని దీదీ తెలిపారు. మహమ్మారి కట్టడికి లాక్డౌన్ పరిష్కారం కాదని, ఇది ప్రజల జీవనోపాథిని దెబ్బతీస్తుందని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు విదిగా మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని కోరారు.గత ఏడాది తరహాలో ప్రజలను వారి ఇంట్లోనే బంధించేందుకు తాను వ్యతిరేకమని దీదీ తేల్చిచెప్పారు.
లాక్డౌన్ విధిస్తే ప్రజల ఆదాయాలు, ఉద్యోగాలతో పాటు ఆర్ధిక వ్యవస్థపై పెను ప్రభావం నెలకొంటుందని అన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ డోసులకు వ్యాక్సిన్ తయారీదారులు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ ఆస్పత్రులు వద్ద వేర్వేరు ధరలను వసూలు చేస్తున్నాయని దీదీ అభ్యంతరం వ్యక్తం చేశారు. కొవిడ్ వ్యాక్సిన్ల ధరల్లో వివక్షపై తాను కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పారు. సంక్షోభ సమయంలో వ్యాక్సిన్లను సొమ్ము చేసుకుంటున్నారని దుయ్యబట్టారు.