న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బుధవారం భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనకు వచ్చిన మమతను టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ నివాసంలో కేజ్రీవాల్ కలిశారు. కేంద్రంలో బీజేపీని అడ్డుకునేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి మూడవ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉన్నది. మరోవైపు పెగాసస్ నిఘాలో బయటపడిన జాబితాలో మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీతోపాటు సీఎం కేజ్రీవాల్ అనుచరుడి పేరు కూడా ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ రెండు అంశాలతోపాటు మరికొన్నింటిపై మమత, కేజ్రీవాల్ చర్చించినట్లు సమాచారం. కాగా, కేజ్రీవాల్తో భేటీకి ముందు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని మమతా బెనర్జీ కలిశారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన మరి కొందరు నేతలతో కూడా ఆమె సమావేశం కానున్నారు.