న్యూఢిల్లీ: పశ్చిమెబంగాల్లో వరుసగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీని భారీ మెజారిటీతో గెలిపించుకున్న మమతాబెనర్జి దేశ నాయకురాలు అని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ అభివర్ణించారు. అయితే, గత అసెంబ్లీ ఎన్నికలకు ఈ అసెంబ్లీ ఎన్నికలకు మధ్య చాలా తేడా ఉన్నదని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మమతాబెనర్జి తన ప్రత్యర్థులైన ప్రధాని నరేంద్రమోదీని, బీజేపీని, సీబీఐ, ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను మట్టికరిపించారని చెప్పారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో మమతాబెనర్జి ప్రధాని పదవి కోసం నరేంద్రమోదీని ఢీకొనే అవకాశాలు ఉన్నాయా అన్న ప్రశ్నకు కమల్నాథ్ స్పందిస్తూ.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమ వ్యూహం ఏమిటనే విషయాన్ని యూపీఏ కూటమి సరైన సమయంలో వెల్లడిస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో మమత ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను, కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని, సీబీఐని, ఈడీని, ఐటీ శాఖను ఓడించారని ఆయన పేర్కొన్నారు.