కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల అనంతరం చెలరేగిన అల్లర్లలో మరణించిన వారికి ఒక్కొక్కరికి రూ రెండు లక్షల పరిహారం అందచేస్తామని సీఎం మమతా బెనర్జీ గురువారం ప్రకటించారు. ఎలాంటి వివక్ష లేకుండా బాధిత కుటుంబాలకు పరిహారం అందుతుందని స్పష్టం చేశారు. ప్రజల తీర్పును అంగీకరించేందుకు సిద్ధంగా లేని కాషాయ పార్టీ ప్రజలను రెచ్చగొడుతోందని దీదీ ఆరోపించారు.
శాంతి భద్రతలు ఈసీ పర్యవేక్షణలో ఉన్న సమయంలో చెలరేగిన హింసాకాండలో మరణించిన వారిలో సగం తమ పార్టీ కార్యకర్తలే ఉన్నారని అన్నారు. మిగిలిన సగం మంది బీజేపీ కార్యకర్తలని, మరొకరు సంయుక్త మోర్చాకు చెందిన వారని చెప్పారు. ఇక బెంగాల్ కు వచ్చే కేంద్ర మంత్రులు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ తో అడుగుపెట్టాలని దీదీ స్పష్టం చేశారు. బీజేపీ నేతలు బెంగాల్ చుట్టూ తిరుగుతున్నారని, కొత్త ప్రభుత్వం ఏర్పడి 24 గంటలు గడవకముందే కేంద్ర టీంలను పంపడంతో పాటు లేఖలు రాస్తూ నేతలను పంపుతున్నారని కేంద్రం తీరును దుయ్యబట్టారు.