బెంగళూర్ : కర్నాటక సీఎం బీఎస్ యడియూరప్ప భవితవ్యంపై నెలకొన్న సందిగ్ధం నేపథ్యంలో రాష్ట్రంలో పాలక బీజేపీ సర్కార్పై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. కాషాయ పార్టీలో అంతర్గత పోరు రాష్ట్ర పాలనపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. యడియూరప్ప ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే కాషాయ పార్టీపై చురకలు వేశారు.
రాష్ట్ర బీజేపీలో అస్ధిరత నెలకొందని ఏడెనిమిది నెలల నుంచి నాయకత్వ మార్పుపై ఊహాగానాలు సాగుతుండగా ఇది రాష్ట్ర పాలనపై ప్రభావం చూపుతోందని ఖర్గే అన్నారు. మరోవైపు సీఎం పదవికి తాను రాజీనామా చేయడం లేదని కర్నాటకలో నాయకత్వ మార్పు వార్తలు నిరాధారమని యడ్యూరప్ప తోసిపుచ్చారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం శ్రమించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు సూచించారని, పార్టీ చీఫ్ జేపీ నడ్డాకు తనపై మంచి అభిప్రాయం ఉందని ఆయన చెప్పుకొచ్చారు.