న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను సమీక్షించి దానికి మార్పులు చేయాలని కేంద్ర మాజీ మంత్రి, అకాలీ దళ్ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల ఆధీనంలోకి వచ్చిన నేపథ్యంలో తలెత్తిన సంక్షోభం వల్ల ఆ దేశ ప్రజలు వేల సంఖ్యలో ప్రాణ భయంతో ఇతర దేశాలకు పారిపోతున్న సంగతిని ఆమె గుర్తు చేశారు. ఆఫ్ఘనిస్థాన్ నుండి వచ్చే హిందువులు, సిక్కులకు పునరావాసం, వారికి భారత్లో భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని విన్నవించారు. ఈ నేపథ్యంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)లో మార్పులు చేసి, ఆఫ్ఘన్ నుంచి వచ్చిన హిందువులు, సిక్కుల పునరావాసాన్ని సులభతరం చేయాలని, వారు భారత పౌరసత్వం పొందేలా సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ట్విట్టర్ ద్వారా ఆమె కోరారు.
అలాగే, ఆఫ్ఘనిస్థాన్లో ప్రాణ నష్టంతోపాటు పవిత్ర ఆలయాలు, గ్రంథాలను తాలిబన్లు నాశనం చేసే ప్రమాదం ఉన్నదని హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్ హిందువులు, సిక్కులతోపాటు పవిత్ర మత గ్రంథాలను సురక్షితంగా, పూర్తి గౌరవ మర్యాదలతో భారత్కు తీసుకు వచ్చేలా చూడాలని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ను ఆమె కోరారు.