న్యూఢిల్లీ : రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పీఎం కిసాన్ (ప్రధాని మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన) ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతన్నలు ఎందరికో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. పంటల సేకరణ కోసం కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)లో చరిత్రాత్మక పెరుగుదలను సాధించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గత ఏడు సంవత్సరాలుగా వ్యవసాయాన్ని మార్చడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఆయన అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన నీటి పారుదల ప్రాజెక్టులు మొదలుకొని.. రైతు రుణాలు పెంచడం, పంటకు సరైన బీమా కల్పించడం, నేలపై దృష్టి సారించడం, మధ్యవర్తులను తొలగించడం వంటి ఎన్నో ప్రయత్నాలు ఇందులో ఉన్నాయన్నారు. గత రెండేళ్ల కిందట సీఎం కిసాన్ పథకం గౌరవ ప్రదమైన జీవితాన్ని, అలాగే కష్టపడి పని చేసే రైతులకు శ్రేయస్సును అందించే లక్ష్యంతో ప్రారంభించినట్లు తెలిపారు.