ముంబై : మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ రాజీనామా చేశారు. ముంబై మాజీ కమీషనర్ పరమ్ బీర్ సింగ్ చేసిన ఆరోపణల కేసులో.. హోంమంత్రి దేశ్ముఖ్పై 15 రోజుల్లోగా సీబీఐ విచారణ పూర్తి చేయాలని ఇవాళ బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హోంమంత్రి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆయన సీఎం ఉద్దవ్ ఠాక్రేకు అందజేశారు. అయితే ఆ రాజీనామా లేఖను సీఎం ఆమోదించాల్సి ఉందని మరో మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. హోంమంత్రిపై తాను ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు ఫిర్యాదు చేసిన కారణంగానే తనను బదిలీ చేశారని పరమ్ బీర్ ఆరోపించారు. పోలీసు అధికారులకు నెలకు రూ.100 కోట్ల వసూళ్ల లక్ష్యం విధించారని, అక్రమ బదిలీలు చేశారని హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై పరమ్ బీర్ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే.
గత విచారణలో ఈ ఆరోపణలపై ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదంటూ బాంబే హైకోర్టు ఆయనను పదే పదే ప్రశ్నించింది. కేసులో హోంమంత్రి, ముఖ్యమంత్రి ఉన్నారని చట్టాలను పక్కన పెడతారా అని ప్రశ్నించారు. పరంబీర్ ఆరోపణలపై ఇక సీబీఐ విచారణ చేపడుతుందని, ఇక ఇప్పుడు ఆయన మంత్రి పదవిలో ఉండడం సరికాదు అని ఎన్సీపీకి చెందిన నేత ఒకరు అభిప్రాయపడ్డారు. కోర్టు ఆదేశాలపై తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని పరంబీర్ సింగ్ తెలిపారు.