ముంబై: కరోనా మూడో వేవ్పై మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నది. ఇందులో భాగంగా పిల్లల కోసం ప్రత్యేక కరోనా సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది. కరోనా ఫస్ట్ వేవ్ వృద్ధులపై ప్రభావం చూపగా ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ యువత, మధ్య వయస్కులపై ప్రభావం చూపుతున్నదని వైద్య పరిశోధకులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో కరోనా థర్డ్ వేవ్ పిల్లలు, చిన్నారులపై ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు. దేశంలో కరోనా మూడో వేవ్ తప్పకపోవచ్చని, అయితే అది ఎప్పుడు వస్తుందో చెప్పలేమని కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారుడు కె విజయ్ రాఘవన్ ఇటీవల పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో దేశంలో కరోనా కేసులు, మరణాల్లో తొలిస్థానంలో ఉన్న మహారాష్ట్ర ఇప్పటి నుంచే కరోనా మూడో వేవ్కు సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా పిల్లలు, చిన్నారుల కోసం ప్రత్యేక కరోనా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే శుక్రవారం మీడియాతో అన్నారు. కరోనా సోకే పిల్లలు, చిన్నారులకు ప్రత్యేక వెంటిలేటర్లు, ఆక్సిజన్ పరికరాలు వంటివి కావాల్సి ఉంటుందని, పిల్లల వెంట తల్లులు కూడా ఉండాల్సి ఉంటుందని తెలిపారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో జరిగిన సమీక్షా సమావేశంలో వీటిని సమకూర్చుకోవాలని నిర్ణయించినట్లు మంత్రి రాజేశ్ వెల్లడించారు.