ఉమ్మడి జిల్లాలోధాన్యం కొనుగోలు అంచనా
9.20 లక్షల ఎకరాల్లో వరి సాగు
22.17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా
మొత్తం 1301 కేంద్రాలు
మొదలైన కొనుగోళ్లు
కరీంనగర్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాసంగి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఉమ్మడి జిల్లాలో వరి సాగైంది. ఎక్కడ చూసినా సిరుల పంట బంగారు వర్ణంలో మెరిసిపోతున్నది. కాళేశ్వరం జలాలు పరుగులు తీయగా, శ్రీరాజరాజేశ్వర జలాశయం, లోయర్ మానేరు డ్యాంతోపాటు మెజారిటీ చెరువులు నీటితో కళకళలాడాయి. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా ఎగువ, దిగువ భూములకు నీళ్లు పారాయి. ఎల్లంపల్లి నుంచి ఎగువమానేరు వరకు ప్రతి ఎకరానూ తడిపాయి. ఓవైపు ప్రాజెక్టులకు నీళ్లు రావడం.. మరోవైపు భూగర్భ జలాలు ఉప్పొంగడంతో వరిసాగు గణనీయంగా పెరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9.19 లక్షలకు పైగా ఎకరాల్లో సాగైంది. తద్వారా 22.17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. స్థానిక అవసరాలకు పోను.. మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం వచ్చే దిగుబడి.. కొనుగోలు చేయాల్సిన ధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని కొనుగోలు కేంద్రాలను పెంచారు. ఇప్పటివరకు 1301 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంకా ఎక్కడ అముసరమున్నా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
అన్నదాతలూ జాగ్రత్తలు తప్పనిసరి..
కేంద్రం ఓవైపు కొత్త చట్టాలు తెచ్చి కర్షకుల నెత్తిన శఠగోపం పెట్టే ప్రయత్నం చేస్తున్నా.. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఆది నుంచీ రైతులకు పక్షానే నిలుస్తున్నారు. కరోనా ఉధృతి కొనసాగుతున్నా.. అన్నదాతకు అండగా నిలించేందుకు యాసంగిలో మద్దతు ధరకు ధాన్యం కొనాలని నిర్ణయించారు. ఈ పరిస్థితుల్లో అన్నదాతల సహకారం పూర్తిగా అవసరమని అధికారులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చేటప్పుడు కనీస ప్రమాణాలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎఫ్సీఐ నాణ్యతా ప్రమాణాల ప్రకారం.. తేమ 17 శాతం లోపు ఉండాలి. అలాగే, చెత్త 1 శాతం, మట్టి పెల్లలు 1 శాతం, చెడిపోయిన, రంగు మారిన, మొలకెత్తిన ధాన్యం 5 శాతం, పూర్తిగా తయారు కాని, ముడుచుపోయిన ధాన్యం 3 శాతం, తక్కువ రకాల మిశ్రమం 6 శాతం చొప్పున ఉన్న ధాన్యానికి కనీస మద్దతు ధర 1,888 చెల్లిస్తారు. సాధారణ రకానికి 1,866 చెల్లిస్తారు. నిర్ణీత నిబంధనలను ఇప్పటికే వ్యవసాయ అధికారులు.. గ్రామగ్రామాన వివరిస్తున్నారు. రైతులు ఈ విషయంలో సహకరిస్తే.. కొనుగోళ్లు పూర్తిగా సజావుగా సాగేందుకు అవకాశముంటుందని చెబుతున్నారు.
ముఖ్యమంత్రి పక్ష పాతి : మంత్రి గంగుల
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కేంద్రం కొత్త చట్టాలు తెచ్చినా అన్నదాతకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలన్న లక్ష్యంతో ఈ యాసంగిలో పెద్ద సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఆ మేరకు వీలైనంత ఎక్కువగా ఉమ్మడి జిల్లాలో కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే, రైతులు కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించి ప్రభుత్వానికి, అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ధాన్యం కొనుగోలు చేస్తున్న విషయాన్ని రైతులు గుర్తించాలని, ధాన్యాన్ని మద్దతు ధరకు విక్రయించుకునేందుకు కావాల్సిన ప్రమాణాలు పాటించాలని కోరారు. క్షేత్రస్థాయిలో ఎక్కడా ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. వ్యవసాయ అధికారులు చెప్పిన ప్రకారం.. రైతులు తమ ధాన్యాన్ని క్రమ పద్ధతిలో తెచ్చి విక్రయించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి
ఆఫీస్ లీజ్.. పుంజుకున్న హైద్రాబాద్, కోల్కతా!
సునీల్ ‘అందాల రాముడు’ ముందుగా ఎవరు చేయాల్సిందో తెలుసా..?