మహబూబ్నగర్టౌన్, మే 25: రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధ్దిపై ప్రత్యేక దృష్టి సారించింది. విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలల్లో చదువు తున్న విద్యార్థినులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడానికి శ్రీకారం చుట్టింది. కొవిడ్-19 నేపథ్యంలో ప్రాథమిక పాఠశాల దశ నుంచి ప్రతి ఒక్కరూ అంతర్జాలంపై ఆధారపడిన విషయం అందరికీ తెలిసిందే. తరగతి గదిలో ప్రత్యక్షంగా పాఠాలు వినడానికి అవకాశం లేదు కాబట్టి పాఠ్యాంశాలతోపాటు అన్ని విషయాలను తెలుసుకోవాడాలని అంతర్జాలంపై ఆధారపడ్డారు. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు మోసగాళ్లు సైబర్ నేరాలకు , మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో అనేక రకాల మోసాలకు, కొంతమంది అమ్మాయిలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ ఆధ్వర్యంలో సైబర్ కాంగ్రెస్ ద్వారా సైబర్ మోసాలపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పిస్తున్నారు.
రాష్ట్రస్థాయి శిక్షణకు 150 మంది ఎంపిక
విద్యాశాఖ ఆధ్వర్యంలో సైబర్ కాంగ్రెస్ ద్యారా సైబర్ మోసాలపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులను ఎంపిక చేశారు. జిల్లాలో 50 పాఠశాలలకు సంబంధించి ఒక్కో పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుడు, ఇద్దరు విద్యార్థినుల చొప్పున 50 మంది ఉపాధ్యాయులు, 100 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ వారంలో వీరికి జూమ్ యాప్ ద్యారా రాష్ట్రస్థాయి శిక్షణ ఇస్తారు. శిక్షణ పొందిన వారు పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించనున్నారు. శిక్షణ పొందిన వారితోపాటు జిల్లా పోలీస్ శాఖ షీటీమ్, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కార్యక్రమాన్ని సమగ్ర శిక్ష కో ఆర్డినేటర్ శోభారాణి పర్యవేక్షించనున్నారు.