జెనీవా: ప్రస్తుతం ప్రపంచాన్ని ఒక్క కరోనా వేరియంట్ మాత్రమే వణికిస్తోందని, అదే ఆందోళన కలిగిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తెలిపింది. ఇండియాలో కనిపించిన బీ.1.617 వేరియంట్లోని ఒక మ్యూటెంట్ మాత్రమే ఆందోళన కలిగించే వేరియంట్గా డబ్ల్యూహెచ్వో గుర్తించింది. నిజానికి ఇది ఒక ట్రిపుల్ మ్యూటెంట్ వేరియంట్. గతంలో ఈ మొత్తం వేరియంట్ను ఆందోళన కలిగించే వేరియంట్గా డబ్ల్యూహెచ్వో ప్రకటించింది. అయితే తాజాగా మంగళవారం ఈ మహమ్మారిపై విడుదల చేసిన ప్రకటనలో మాత్రం.. ఈ ట్రిపుల్ మ్యూటెంట్లో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే ఎక్కువగా వ్యాపిస్తోందని, మిగతా రెండింటి ప్రభావం తక్కువేనని చెప్పింది.
బీ.1.617.2 వేరియంట్ను ఆందోళన కలిగించే వేరియంట్గా డబ్ల్యూహెచ్వో గుర్తించింది.
ఇండియాలో తొలిసారి కనిపించిన ఈ వేరియంట్కు డెల్టా అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఈ బీ.1.617.2 వేరియంట్తోపాటు మరో మూడు వేరియంట్లు మాత్రమే చాలా ప్రమాదకరంగా కనిపిస్తున్నాయని, కరోనా అసలు వేరియంట్ కంటే ఇవి చాలా వేగంగా వ్యాపిస్తున్నాయని డబ్ల్యూహెచ్వో తన ప్రకటనలో వెల్లడించింది. వ్యాక్సిన్లను కూడా ఇవి బోల్తా కొట్టిస్తున్నట్లు తెలిపింది.
ఆయా దేశాల్లో కనిపిస్తున్న వేరియంట్లకు గత సోమవారం డబ్ల్యూహెచ్వో గ్రీకు పేర్లు పెట్టింది. అందులో ఇండియన్ వేరియంట్ను డెల్టాగా పిలిచింది. ఇప్పుడీ డెల్టా వేరియంట్ చాలా దేశాలకు పాకిందని, ఆయా దేశాలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు డబ్ల్యూహెచ్వో చెప్పింది. ఈ వేరియంట్పై తాము అధ్యయనాలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఈ మధ్యే డెల్టా వేరియంట్తో కూడిన ఓ కొత్త హైబ్రిడ్ను వియత్నాంలో గుర్తించిన విషయం తెలిసిందే. ఆ దేశంలో ఇప్పుడీ వేరియంట్ చాలా వేగంగా వ్యాపిస్తోంది.