గద్వాల, జూన్ 9: ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. గద్వాలలోని జిల్లా దవాఖానలో ఏర్పాటుచేసిన డయాగ్నస్టిక్ కేంద్రాన్ని బుధవారం ఎంపీ రాములు, జడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్సీ ఎస్ వాణీదేవి, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్రెడ్డి, అబ్రహంలతో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. డయాగ్నస్టిక్ సెంటర్లో ఉచితంగా 57 పరీక్షలు చేస్తారని, ఇది పేదలకు వరమని చెప్పారు. వైద్యారోగ్యశాఖలో విప్లవాత్మక మార్పులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. దవాఖానలో ఏర్పాటుచేసిన క్యాన్సర్ వార్డును ఎంపీ రాములు, ఎమ్మెల్సీ ఎస్ వాణీదేవి ప్రారంభించారు. డయాగ్నస్టిక్ సెంటర్లో ఎంపీ పరీక్షలు చేయించుకున్నారు. దవాఖాన ఆవరణలో రోగుల కోసం ఏర్పాటుచేసిన నిత్యాన్నదాన కార్యక్రమంలో మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ పాల్గొని రోగులకు వారి బంధువులకు అన్నదానంచేశారు.