ఇరాక్ : ఇరాక్లోని నస్రియా అల్ – హుస్సేన్ ఆస్పత్రిలో సోమవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. కరోనా వార్డులో చికిత్స పొందుతున్న 52 మంది రోగులు మృతి చెందారు. మరో 13 మంది రోగులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కరోనా వార్డు 70 పడకలతో 3 నెలల క్రితం ప్రారంభమైంది. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించింది. గాయపడ్డ రోగులను సమీప ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై ఇరాక్ ప్రధానమంత్రి ముస్తాఫా ఆల్ కాధేమీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మినిస్టర్స్తో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను విశ్లేషించాలని అధికారులను ఆదేశించారు. అయితే ఆక్సిజన్ ట్యాంకర్స్ పేలడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇరాక్లో అగ్నిప్రమాదంలో కరోనా రోగులు మరణించడం ఈ ఏడాది ఇది రెండోసారి. ఏప్రిల్లో బాగ్దాద్ ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ పేలి దాదాపు 82 మంది మృతి చెందారు.