దేశాల సరిహద్దులు కొలతలు గీసినట్టుగా క్రమంగా ఉండవు కదా! ఆ దేశ పరిస్థితులు ఎలా ఉంటాయి? శ్రీరామశర్మ, కొత్తకోట
దేశాలు ఇండ్లు కావు. వాటికి సరిహద్దుల్లో ఆయా దేశాలు రక్షణకోసం కంచెలు ఏర్పాటు చేస్తుంటాయి. ప్రధానంగా దేశాలమీద పర్వతాలు, ఖండాలు, సముద్రాల ప్రభావం ఉంటుంది. ఆ విధంగా మన దేశంపై ‘హిమాలయాల’ ప్రభావం ఉంది. ఖండ చాలనం (ఖండాలు ఢీ కొనడం) వల్ల హిమాలయాలు ఉద్భవించాయి. అందుకే, భారతావనిలో హిమాలయాల పుట్టుకకు పూర్వం స్థితిగతులకు, ఏర్పడిన తర్వాత పరిస్థితులకు తేడా ఉంది. అలాగే, ఆయా దేశాల సరిహద్దుల్లో వచ్చే ‘భౌగోళిక’ మార్పులు ఆ దేశ ప్రజల ఆరోగ్య, మానసిక వికాసాలపై ప్రభావం చూపుతాయి. వీటిని ప్రకృతి ‘విశ్వాత్మ ఆదేశం’ మేరకు రూపకల్పన చేస్తుంది. వీటిని మనిషి మార్చి అనుకూల రూపంలోకి తెచ్చే అవకాశం ఉండదు. ఏ దేశ సరిహద్దులు ఎలా ఉన్నా ప్రజల నివాసాలు బాగు చేసుకునే అవకాశం వాస్తుశాస్త్రం కల్పిస్తున్నది.
వీధిపోటు ఇంటికి మధ్యలో వస్తే దోషం ఉండదా? గుడికీ అంతేనా? కొత్త అనంతరెడ్డి, వికారాబాద్
శాస్త్రబద్ధంగా నిర్మించుకున్న గృహం..పూర్వజన్మల పాలాల నుంచి మనిషి తననుతాను కాపాడుకోవడానికి మహర్షులు అందించిన ఓ వరం. కొందరు దీనిలోని ఆంతర్యాన్ని గ్రహించకుండా, తోచింది చెబుతుంటారు. ఇంటి మధ్యలోకి రోడ్డు చూస్తుంటే వీధిపోటు కలుగుతుంది. కాకపోతే, తీవ్రతలో కొంత తేడా ఉంటుంది. గుడి వేరు, గృహం వేరు. నైరుతి వీధిపోటుకు ఇంటికి దక్షిణం రోడ్డు ఉన్నాకూడా తీవ్ర ఫలితం కలుగుతుంది. సహజంగా డైరెక్టుగా రోడ్డుచూపు ఉండే వీధిపోట్లు చాలా అరుదుగా ఉంటాయి. ఇండ్లకు వీధిచూపు ఫలమైనా, వీధిపోటు ఫలమైనా, మధ్య అడ్డురోడ్డు ఉన్నా తప్పక వస్తుంది.
ఇంటి ప్రహరీకి ఎన్ని కోణాలు ఉండాలి? బి.సారయ్య, ఉప్పల్
మన శాస్త్ర నిపుణులు చతురస్రంగా నిర్మాణం రావాలని, ఇంటికి నాలుగు మూలలూ ఉండటం మంచిదని చెప్పారు. ‘ఐదు మూలలు వచ్చాయీ’ అంటే నిర్మాణంలో పరిపూర్ణత్వం రాలేదని అర్థం చేసుకోవాలి. అయినా, కొన్ని వాణిజ్య పరమైన నిర్మాణాలు ఆగ్నేయ-వాయవ్య మూలలు తెగినప్పుడు వాటికి అవకాశం ఇచ్చారు. అందులో కుటుంబాలు నివసించవనే ఉద్దేశంతో వాణిజ్య నిర్మాణాలకు ఆ మినహాయింపు ఇచ్చారు. ప్రహరీలకు ఈ అంశమే లేదు. కొన్ని కొన్ని స్థలాలకు ప్రధానవీధిని కలుపుకొని ‘తూర్పు ఈశాన్యం’ పెంచుతూ రోడ్డు వేసి ప్రహరీ నిర్మించాల్సి వస్తుంది. అప్పుడు, కాంపౌండ్కు ‘ఐదు కోణాలు’ వస్తాయి. ఇది దోషం కాదు. మీకు అందుబాటులో ఉన్న స్థలాన్నిబట్టి పద్ధతిగా కాంపౌండ్ నిర్మించుకోండి.
మా ఊరిలోని పాత ఇంట్లో నైరుతి గదిలో దేవుణ్ని ఉంచాం. దాన్ని మార్చాలని అంటున్నారు. తప్పదా? వల్లమాను సరళ, పెద్దపల్లి
తెలంగాణ పల్లెల్లో కొన్నిచోట్ల ఇప్పటికీ ‘పైభాగం’ అని నైరుతిని సంబోధిస్తుంటారు. ఆ భాగంలో దైవం ఉండాలని అమ్మవారిని (దేవతలను) నైరుతి గదిలో స్థాపించి నైవేద్యాలు సమర్పిస్తుంటారు. వాస్తవానికి దైవస్థానం గృహంలో ఉచ్ఛభాగంలో ఉండాలి. ఇంటిని రెండు భాగాలుగా చేస్తే తూర్పు-పడమర, ఉత్తర-దక్షిణాలుగా విడిపోతాయి. ఆ విధంగా విభజన చేసి తూర్పు-ఉత్తర భాగాలలో మీ అమ్మవారిని నిలబెట్టుకోండి. మీ పూజగదిని మార్చుకోవాల్సిందే. పూర్తి ఈశాన్యంలో గదిని కట్టకండి. ఈశాన్యం వదిలి తూర్పుమధ్యలో కానీ, ఉత్తరం మధ్యలో కానీ ‘అమ్మవారిని’ నిలుపండి. మీ సౌకర్యార్థం విశాలమైన గదిని కట్టుకోండి. బోనం సమర్పించే సంప్రదాయం కూడా ఉంటుంది కాబట్టి, గది కాస్త విశాలంగా ఉండేలా చూసుకోండి.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678