ముంబై: చేపలు పట్టిన ఒక మత్స్యకారుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైకి సమీపంలోని పాల్గడ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ముర్బే గ్రామానికి చెందిన మత్స్యకారుడు చంద్రకాంత్ తారే, చేపల వేటపై నిషేధం ఎత్తివేసిన తర్వాత ఆగస్ట్ 28న తొలిసారి చేపల వేట కోసం తన పడవలో సముద్రంలోకి వెళ్లాడు. వల విసరగా చాలా బరువుగా అనిపించింది. వలను లాగి చూడగా ఎంతో ఖరీదైన సుమారు 150 ఘోల్ చేపలు అందులో చిక్కాయి.
ఘోల్ చేపలు ఎంతో రుచికరమైనవేకాదు, అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఔషధాలు, ఇతర ఉత్పత్తులను తయారు చేయడానికి ఈ చేప శరీర భాగాలు వినియోగిస్తారు. ఈ నేపథ్యంలో ఘోల్ చేప వివిధ దేశాలలో అత్యంత ధర పలుకుతుంది. దీనిని ‘బంగారు గుండె కలిగిన చేప’ అని కూడా అంటారు. ఘోల్ ఫిష్ శాస్త్రీయ నామం ప్రోటోనిబియా డైకాంతస్. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కనిపించే ఒక రకమైన బ్లాక్స్పాటెడ్ క్రోకర్ జాతి చేప ఇది. సముద్ర చేపలలో అత్యంత ఖరీదైన చేపగా ఘోల్ ఫిష్ను పరిగణిస్తారు.
కాగా, భారీ సంఖ్యలో ఘోల్ చేపలు వలలో పడటంతో చంద్రకాంత్, తోటి మత్య్సకారులు ఆనందంతో కేరింతలుకొట్టారు. తమ సంతోషాన్ని మొబైల్స్లో వీడియో తీసుకున్నారు. అనంతరం సుమారు 150 ఘోల్ చేపలను వేలం వేయగా రూ.1.33 కోట్లకు అమ్ముడయ్యాయి. ఒక్కో చేప సుమారు రూ.87 వేల ధర పలికింది.
చంద్రకాంత్ తారే కుమారుడు సోమనాథ్ ఈ బిడ్ను ధృవీకరించారు. అయితే డీల్ ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. ఘోల్ చేపల కడుపులో చిన్న సంచి మాదిరిగా పర్సు ఉంటుందని, దీనికి విదేశాలలో చాలా డిమాండ్ ఉందన్నారు.