ముంబై :దేవేంద్ర ఫడ్నవీస్ సారధ్యంలోని గత బీజేపీ ప్రభుత్వ హయాంలో వెల్లువెత్తిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై విచారణకు డీజీపీ సంజయ్ పాండే నేతృత్వంలో అత్యున్నత స్ధాయి కమిటీని మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉండగా ఫడ్నవీస్ ప్రభుత్వం రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధుల ఫోన్లను ట్యాప్ చేసిందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ శనివారం ఆరోపించారు. తప్పుడు పేర్లను ఇవ్వడం ద్వారా రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధుల ఫోన్లను ట్యాపింగ్ చేశారని అన్నారు.
కాంగ్రెస్ నేత నానా పటోల్ ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదులో వాస్తవం ఉందని చెప్పారు. నానా పటోల్ విషయంలోనూ ఇదే జరిగిందని చెప్పిన అజిత్ పవార్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై నిగ్గుతేల్చేందుకు అత్యున్నత కమిటీని ఏర్పాటు చేశామని అజిత్ పవార్ తెలిపారు. దేశం, ప్రజల భద్రత కోసం ఫోన్ ట్యాపింగ్ జరిగితే మంచిదేనని, కానీ రాజకీయ, వ్యక్తిగత లబ్ధి కోసం రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం దారుణమని అన్నారు. ఇది చట్ట విరుద్ధమని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలకు తావు లేదని ఆయన పేర్కొన్నారు.